తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు తెలంగాణలో తీవ్ర అవమానం జరిగిందని, ఈ విషయం ఏపీ ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన వివరించారు.
ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతామని అన్నారు. ఇదే సమయంలో ఈసీపైనా వీహెచ్ ఆరోపణలు చేశారు. ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్న ఈసీ ఓవరాక్షన్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎవరిపై దాడి చేయమంటే, వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇండియాలోని స్వతంత్ర వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టించారని వీహెచ్ ఆరోపించారు.