కేసీఆర్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధిపై గవర్నర్ తో అధికార పార్టీ అసత్యాలు చెప్పించిందని ఆరోపించారు.
ఇంటింటికీ నల్లా నీరు రావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ లో చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, వాళ్లు త్వరలోనే బయటకు రాబోతున్నారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలతోనే టీఆర్ఎస్ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సరైన నాయకుడిని ఎన్నుకోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తప్పు చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. అధిష్ఠానం ఈసారి తమకు అవకాశం ఇవ్వకపోతే ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తామా? లేక కొత్త పార్టీ పెడతామా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.