సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడలేదని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. దురాక్రమణలు జరగకపోతే ఇంతమంది సైనికులు ఎందుకు మరణించారు? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తన విమర్శల్లో మరింత పదును పెంచారు. ప్రధాని మోదీ చైనాకు లొంగిపోయారన్న అర్థంలో, “నరేందర్ మోదీ కాదు, వాస్తవానికి ఆయన సరెండర్ మోదీ” అంటూ ఎద్దేవా చేశారు.
చైనా దూకుడుకు తలొగ్గిన ప్రధాని మోదీ భారత భూభాగాన్ని వారికి అప్పగించేశారని ఆరోపించారు.ఈ సందర్భంగా జపాన్ టైమ్స్ పత్రికలో భారత ప్రభుత్వ వైఫల్యం అంటూ వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా భారత్ నాయకత్వం చైనాకు అణిగిమణిగి ఉంటోందని, దాని ఫలితమే భారత్ భూభాగంలో చైనా మరోసారి ఆక్రమణకు పాల్పడిందని జపాన్ పత్రిక పేర్కొంది. ఈ పరిణామంతోనైనా మోదీ ఆలోచనా దృక్పథం మారేనా? అంటూ ఆ పత్రికలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.