దేశంలో పౌర పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలపై మరో దాడికి రంగం సిద్ధమైందని అన్నారు. ఎన్ పీఆర్, ఎన్నార్సీ ప్రజలపై దాడి చేసేందుకు ఉద్దేశించినవేనని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులకు వెళ్లిన సామాన్య ప్రజలు డబ్బులు తీసుకోలేని పరిస్థితులు కనిపించాయని తెలిపారు.
ఇప్పుడు ఎన్ పీఆర్, ఎన్నార్సీ కూడా అలాంటివేనని అన్నారు. పేద ప్రజలు తమ గుర్తింపు పత్రాలతో అధికారుల వద్దకు వెళితే వారు లంచం అడగడం ఖాయమని రాహుల్ పేర్కొన్నారు. లంచం ఇవ్వకపోతే ఆ పత్రాలను, వాటిలో పేర్లను అధికారులు తారుమారు చేస్తారని వివరించారు. దాంతో మరోసారి పేద ప్రజల జేబులు ఖాళీ అవడం తథ్యమని రాహుల్ వ్యాఖ్యానించారు.