చంద్రయాన్-2 ప్రయోగం చివరి ఘట్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. చివరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, “విక్రమ్” మరో నిమిషంలో గమయాన్ని చేరుకునే తరుణంలో సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిరాశను తొలగించేందుకు పలువురు వారికి భరోసాను అందిస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చంద్రయాన్-2 ప్రయోగంపై స్పందించారు. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇది ప్రత్యేకంగా భారత్కు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తన ట్వీట్లో రాహుల్ “చంద్రయాన్-2 ప్రయోగంలో భాగస్వామ్యం వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇది భారతీయులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు పడిన శ్రమ వృథా కాదు. ఇది అంతరిక్షంలో చేయాల్సిన ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని” పేర్కొన్నారు