అక్రమార్జన కేసులో జైలుపాలైన వీకే శశికళ విడుదల అవగానే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన శశికళ సీఎం అవడం లాంఛనమేనన్న సమయంలో అనూహ్యంగా జైలు పాలయ్యారన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న శశికళ జైలు శిక్ష త్వరలో పూర్తి కానుందన్నారు. ఆమె జైలు నుంచి విడుదల అయితే తమిళ రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్ స్థాపించిన ఏఎంఎంకే, అన్నాడీఎంకే పార్టీలో విలీనమై పార్టీ పగ్గాలు శశికళ చేతికి వస్తాయని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారాయి. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన పలు పరిణామాలనంతరం పార్టీ పదవులకు సంబంధించి అన్నాడీఎంకే పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం, ఉప సమన్వయ కర్తగా ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పదవుల్లో మాత్రం ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
previous post
next post