ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మరోవైపు టికెట్ల ధరలు పెంచి ఆ భారమంతా ప్రజలపై మోపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిపోయిందనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మరో సమస్యను తెరపైకి తెచ్చిందని అన్నారు. టికెట్ల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. చార్జీలను తగ్గించకపోతే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, వాటిని తగ్గించడంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందన్నారు. అంతేకాక చార్జీలు కూడా పెంచలేదని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిందని విమర్శించారు. విలీనం సంగతిని ఉపేక్షించడమేకాక, టికెట్ల ఛార్జీలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.