కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి గురించి మరోసారి ప్రశ్నించవద్దని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.. తాను ఇప్పటికే రాజీనామా చేశానని, తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే చెప్పేశానని ఆయన పేర్కొన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవి అంశం ప్రస్తావనకు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. వారిని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా దీనిపై కథనం ప్రచురించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ పదవి చేపట్టే అంశంపై ఎలాంటి ప్రశ్నలూ వేయవద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.