హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్ పై భాగం నుంచి పెచ్చులూడి పడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మౌనిక మృతికి ఎల్ అండ్ టీపై మర్డర్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిన్న అమీర్పేట మెట్రో స్టేషన్లో కాంక్రీట్ పడి చనిపోయిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ సందర్శించి ఓదార్చకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. మెట్రో స్టేషన్ నిర్మించి రెండేళ్లు కాకుండానే ఇలా జరిగిందన్నారు. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. గతంలో పెచ్చులు ఊడిపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనుకే నిన్న ఒక అమ్మాయి చనిపోయిందని పేర్కొన్నారు.