తెలంగాణలో ఈ నెల 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి.మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలచివేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు కూడా వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటికే ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా రంగప్రవేశం చేశారు. ఇంటర్ బోర్డు వద్దకు ఆయన రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. రేవంత్ అండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఊగిపోయారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు కనిపించడంతో పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేశారు.