పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా చర్చలు తప్పవని హెచ్చరించారు. గెలిచిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏదైనా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పాలని సూచించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ నిర్ణయం తీసుకునే వరకూ ఆ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. రాహుల్ మంచి ఫైటర్ అన్న విషయం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం తేలిపోయిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల వ్యూహరచనకు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఓ కమిటీ వేస్తామని కుంతియా తెలిపారు.