సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అప్పులే తప్ప, తన వద్ద డబ్బులేమీ లేవని అన్నారు. తన వద్ద చాలా డబ్బుందని అందరూ అనుకుంటూ ఉంటారని, కానీ, కార్యకర్తలు, నాయకులే తనకు అప్పులు ఇస్తుంటారని వెల్లడించారు. ఆ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.
కార్యకర్తల వైద్యానికి, వారి పిల్లల పెళ్లిళ్లకూ చేసే సాయం ఈ డబ్బులతోనేనని అన్నారు. మొత్తం మీద తనకు రూ. 100 కోట్ల వరకూ అప్పులున్నాయని వ్యాఖ్యానించారు. తాను ఎవరెవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నానో గుర్తుంచుకున్నానని అన్నారు. కొంతమందిని వేదికపైకి పిలిచి, “నీ వద్ద ఎంత తీసుకున్నాను?” అని అడిగి, వారితో సమాధానం చెప్పించారు. మొన్న జరిగిన దసరా పండగకు తాను దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేశానని జగ్గారెడ్డి తెలిపారు.