కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ రోజు అన్నీ రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నాయి. హైద్రాబాద్ నగరంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగర వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనతా కర్ఫ్యూ నిర్ణయం మంచిదేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కర్ఫ్యూతో కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చునని అన్నారు. జనతా కర్ఫ్యూ 15 రోజులు పొడిగించినా మంచిదేనన్నారు. మనిషికి ప్రాణం ముఖ్యమని, డబ్బు, పదవులు కాదని అన్నారు. సంగారెడ్డిలో ప్రజలు జనతా కర్ఫ్యూకు పూర్తిగా సహరించాలని కోరారు.