పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై… ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్న అసెంబ్లీ లాబీలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్లు ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి ఆరా తీశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్ననాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను.
పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా అంటూ శుక్రవారం జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
దీంతో ..జగ్గారెడ్డి ని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఏఐసీసీ కార్యదర్శులను ఆదేశించారు. ఇటీవల నియమితులైన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఇవాళ తొలిసారిగా సమావేశం అవుతుంది. ఈ సాయంత్రం జరిగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల సమావేశానికి రావల్సిందిగా జగ్గారెడ్డి కి… పీసీసీ సమాచారమిచ్చింది. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న మాణికం ఠాగూర్… ఆ సమావేశంలో చర్చకొచ్చే అంశాలను వివరించనున్నారు. సాయంత్రం గాంధీభవన్లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ జగ్గారెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవడం కొత్తేమీ కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి దక్కకుండా చాలామంది నేతలు ఎన్నో కుట్రలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. మొత్తానికి అడ్డంకులన్నీ అధిగమించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది.