తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ‘ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర’ ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్చాందీ మంగళవారం అనంతపురం జిల్లా మడకశిర నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు.
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారు.మార్చి 3వ తేదీ వరకూ 2251 కిలోమీటర్లు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేతలు, జాతీయ స్థాయి నాయకులు, స్టార్ క్యాంపెనర్లు పాల్గొంటారు. ఈ నెల 22న తిరుపతిలో జరిగే యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారు. 27వ తేదీ యాత్రలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పాల్గొంటారని రఘువీరారెడ్డి తెలిపారు.