రానా దగ్గుపాటి , సాయి పల్లవి నటించిన సినిమా ‘విరాటపర్వం’. నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర బృందం.
ఈ క్రమంలోనే సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వివాదానికి కారణమేమంటే….
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం దాన్ని మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈ మధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, జైశ్రీరామ్ అని చెప్పమన్నారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? మనమంతా మంచి మనుషులుగా ఉండాలి. అప్పుడే ఐక్యత ఉంటుంది’’ అని పేర్కొంది.
హింసకు తావు ఉండకూడదని చెప్పడం సాయి పల్లవి ఉద్దేశమని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
అయితే ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని భజరంగ్దళ్ నాయకులు సుల్తాన్బజార్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.
అయితే, ఆమె చెప్పాలనుకున్న విషయం ఒకటైతే. ప్రచారం మరోలా సాగుతోందని ఆమె అభిమానులు అంటున్నారు. కొన్ని టీవీ చానెళ్లు ఆమె వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. పదే పదే ప్రచారం చేయడం కూడా వివాదం పెద్దది కావడానికి కారణమైందని తెలుపుతున్నారు.దీనిపై సాయిపల్లవి ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.