డ్రైవర్ల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు నాగశౌర్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. ఈ నెల 3న ఓ టీవీ చానల్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న నాగశౌర్య రిపోర్టర్ జాఫర్ ‘అశ్వత్థామ’ సినిమాపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… డ్రైవర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆరోపించారు. డ్రైవర్లు చదువురాని వారు, తాగుబోతులు అని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అతడిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరారు. “అశ్వద్ధామ” ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో ఆయన అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడానికి కారణాలను వెల్లడించారు. చదువుకోకపోవడం వల్ల కొంత మంది ఇలాంటి పనులు చేస్తున్నారని, ఒకవేళ వాళ్లు చదువుకుంటే ఇలాంటివి చేయకూడదనే భయం వాళ్లలో ఉంటుందన్నారు. అలాగే, డ్రైవర్లు తాగేసి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. బహుశా ఈ మాటలే ట్యాక్సీ డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించినట్టుంది. మరి ఏ విషయంపై నాగశౌర్య స్పందన ఎలా ఉంటుందో చూడాలి.