టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కర్నాటకలో ఓ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. తెలుగువారు ఎక్కువగా వున్న చిక్కబళ్లాపురలో ఆయనకి బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఆయన ఇప్పటికే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కర్నాటక ఉపఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. గతంలో కోట శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక మరో కమెడియన్ బాబూమోహన్ కూడా బీజేపీలోనే ఉన్నారు. అదే రూటులో ఇప్పుడు బ్రహ్మానందం కూడా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కర్నాటకలో డిసెంబర్ ఐదో తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్రహ్మానందం, చిక్క బళ్లాపుర నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీలో చేరటం గురించి క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. సుధాకర్ తనకు మిత్రుడని, అందుకే ఆయన గెలుపుకోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం ప్రచారంలో జోష్ కనిపించింది. చిక్కబళ్లాపురలో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2018లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసిన కేవీ నవీన్ కిరణ్ తరపున హీరో పవన్కల్యాణ్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో నవీన్కుమార్, ప్రస్తుతం బరిలో ఉన్న సుధాకర్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఆయనకి 18.58 శాతం ఓట్లు వచ్చాయి.