జిల్లాకే ఉన్నతాధికారి హడావుడేమీ లేకుండా ఒంటరిగా సైకిల్పై వెళ్లి… ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలెలా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ నారాయణరెడ్డి చేసిన ప్రయత్నమిది. రెండు రోజుల క్రితమే కలెక్టర్గా వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం సాధారణ వ్యక్తిలా జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. ఓ రోగిని ఎవరూ పట్టించుకోకుంటే అతడికి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఆయన మాటలను అక్కడి వైద్యులు పట్టించుకోలేదు.. చివరికి తాను కలెక్టర్నని చెప్పేసరికి ఉరుకులు పరుగులతో వైద్యం చేశారు. ఆసుపత్రి సిబ్బందికి సంబంధించిన బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు.
వైద్యులు, ఉద్యోగులు మొత్తం 210 మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా, వారిలో 111 మంది హాజరు నమోదు కాలేదు. ఈ 111 మందికీ కలెక్టరేట్ నుంచి మెమోలు పంపించనున్నట్టు నారాయణరెడ్డి చెప్పారు. తర్వాత కాన్పుల వార్డుల్లోకి వెళ్లి అప్పుడే పుట్టిన చిన్నారిని ఎత్తుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిని రోజుకు ఎన్నిసార్లు శుభ్రం చేస్తారని అడిగారు. మంచినీటిని అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.