తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేసిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమార స్వామి ఆరోపించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవి అంటే ముళ్ల కిరీటంలా అనిపించిందన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమార స్వామి స్పష్టం చేశారు. బీజేపీ గద్దెనెక్కేందుకు చేయకూడని పనులు చేసిందని మండిపడ్డారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం కుట్రలు పన్నుతున్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకరించలేదని విమర్శించారు. ఇకపోతే తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఎందుకు వారు తనకు వెన్నుపోటు పొడిచారో అర్థం కావడం లేదన్నారు. తనను కాదని వారు ముంబై వెళ్లిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కుమార స్వామి వెల్లడించారు.