ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన వివరాలను ఆర్థికమంత్రి టీ హరీశ్రావు మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని చింతల్చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆయన ప్రారంభించనున్నారు. రంగనాయకసాగర్ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్రావు తెలిపారు. కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగనున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగనున్న ప్రాంతాలలో మంత్రి హరీశ్రావు శనివారం జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవీస్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఇతర అధికారులు, ప్రజాప్రతనిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాలు జరిగే ప్రతి ప్రదేశంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలకు మంత్రి హరీశ్రావు బాధ్యతలు అప్పగించారు.
previous post