*వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
*భారీ వర్షాలుతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అలాగే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని తెలిపారు.