telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేడ్చల్‌లో నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

*మేడ్చ‌ల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
*మేడ్చల్‌లో నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు మేడ్చల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు.శామీర్‌పేట సమీపంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ నిర్మించారు. రూ.56.20 కోట్ల వ్యయంతో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేశారు

భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని  ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మైదానంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు.

నిన్న వికారాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం కలెక్టర్ చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్లో కూర్చున్న కలెక్టర్ ను సీఎం కేసీఆర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్‌ 11న మేడ్చల్‌–మల్కాజిగిరి ,వికారాబాద్‌ జిల్లాలు ఏర్పాటయ్యాయి.

Related posts