ఏపీలోనే కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్ను రంగంలోకి దింపారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మంత్రులను, ఎమ్మెల్యేలను మండలాలవారీగా ఇన్ఛార్జ్లుగా నియమించారు కూడా. నామినేషన్ల క్రతువు పూర్తికావడంతో జిల్లా మంత్రి జగదీష్రెడ్డితోపాటు ఇతర మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. సభలు, సమావేశాలు కాకుండా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు నాయకులు. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసి హాలియా బహిరంగసభలో ప్రసంగిస్తూ.. జిల్లాకు, నాగార్జునసాగర్కు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు ముఖ్యమంత్రి. సాగర్ ప్రచారానికి ఇప్పుడు 15 రోజులే గడువుంది. సీఎం ప్రచారానికి వెళతారో లేదో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. హుజూర్నగర్ ఉపఎన్నిక జగినప్పుడు ప్రచారం ఆఖరురోజు వెళ్లాలని ఏర్పాట్లు చేశారు.
ఆ రోజు వర్షం కారణంగా సభ రద్దయింది. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి గులాబీ దళపతి వెళ్లలేదు. హరీష్రావుకు ప్రచార బాధ్యతలు అప్పగించి దూరంగా ఉన్నారు. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. కేటీఆర్, హరీష్రావుతోపాటు జిల్లాకొక మంత్రిని ఇన్ఛార్జ్గా వేశారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉపఎన్నిక బరిలో ఉన్నారు. వరస ఓటములతో సాగర్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టగా తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బల తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్ సాగర్ను చేజార్చుకోవద్దని భావిస్తోంది. జిల్లా మంత్రి జగదీష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్రావు ప్రచారానికి వెళతారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైనప్పుడు మాత్రం ప్రచారానికి వస్తానని కేసియార్ చెప్పినట్టు సమాచారం. సాగర్లో పార్టీ పరిస్థితి అంచనా వేశాక తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ వెళ్లినా 14,15 తేదీల్లో జరిగే సభకు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతల అంచనా.
previous post