telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం : 50 వేల నియామకాలకు గ్రీన్ సిగ్నల్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. అంతేకాకుండా.. వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సిఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం తెలిపారు.  https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx.. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు.
వరంగల్లు అదిలాబాద్ ల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన్ల ప్రారంభం : 729 మంది వైద్య సిబ్బంది నియామకం
వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎం జి ఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్’ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పి ఎం ఎస్ ఎస్ వై కింద ఎంజిఎం లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సిఎం ఆదేశించారు.
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఐటీ , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి , కోవిడ్ సీ ఎం ఓ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి , హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు , డీ ఎం ఈ కె.రమేష్ రెడ్డి , కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి , టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి , టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .
ఈ సమీక్ష సందర్భంగా… రాష్ట్రంలో ఆక్సీజన్ , రెమిడిసివర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదని, రెమిడిసివర్ ఇంజక్షన్లు అందుబాటులోనే వున్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్దంగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు సిఎం కు వివరించారు. ప్రభుత్వ దవాఖాన్లలలో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో వున్నాయని, 2470 ఆక్సీజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్దంగా వున్నాయని తెలిపారు. మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో వున్నాయన్నారు. కాగా ప్రయివేటు దవాఖానాల్లో రెమిడిసివర్ ఇంజక్షన్ల ను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను చేయాని సిఎం సూచించారు.

Related posts