కేంద్రప్రభుత్వం తో నేడు తాడో పేడో తేల్చుకోవడాని సీఎం కేసీఆర్ ఈవేళ ఢిల్లీ వెళ్లనున్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు తేల్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బృందాలు వెళ్లనున్నాయి. సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందాలు దేశ రాజధానికి వెళ్లనున్నాయి. సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులను రాష్ట్ర మంత్రులు, అధికారులు కలవనున్నారు.
శనివారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీలో పెద్దలతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు.
ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం ప్రకటించినట్లు అనధికార వార్త వచ్చిందని.. అది నిజమో కాదో కూడా తెలుసుకుంటామన్నారు. అనురాధ కార్తె ప్రారంభమైనందున కేంద్రం త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండి.. అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.