కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
కేంద్రం లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చలు జరిపారు. మానవతా దృక్పథంతో పనిచేద్దామని అధికారులతో జగన్ అన్నారు. నేటి నుండి మళ్లీ రేషన్ పంపిణీ చేస్తోన్న నేపథ్యంలో రేషన్ షాపులకు అనుబంధంగా కౌంటర్ల పెంపునకు జగన్ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు వివిధ రంగులతో కూడిన కూపన్లు అందజేయాలని తెలిపారు. ఏ రోజు, ఏ సమయంలో రేషన్ తీసుకోవాలో కూడా ఆ కూపన్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు.