ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామని.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అవి రోడ్డున పడే పరిస్థితి ఉందని.. ఎంఎస్ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని జగన్ చెప్పారు.
కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది.