ఏపీ సీఎం జగన్ ను ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. బాధితులను పరామర్శించి తిరిగి అమరావతికి వెళ్లేముందు జగన్ ను వీరు కలుసుకున్నారు. గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలను ఈ సందర్బంగా వివరించారు. లీకేజీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు.
గ్యాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందిస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.