టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేశారని విమర్శించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలంలోనే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశానని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబులోని మోసపూరిత గుణానికి, తనలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్లాంట్ కు కావాల్సిన నీరు, ముడి ఇనుము తదితర అన్ని సౌకర్యాల కల్పనకూ సంబంధిత విభాగాలు, కంపెనీల నుంచి అనుమతులు తెచ్చిందని స్పష్టం చేశారు. ఈ కర్మాగారాన్ని మూడు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రూ. 15 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.