చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లాలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. పలువురు చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులతో కలిసి గడపడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ అని సీఎం వ్యాఖ్యానించారు.
తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందన్నారు. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదల కష్టాలు చూశానన్నారు. చదివించాలన్న ఆరాటం ఉన్నా.. చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా. పిల్లలను ఇంజనీరింగ్ చదవించాలనీ, ఆ ఖర్చులను భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను నా కళ్లారా చూశానని అన్నారుమీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. వచ్చే ఏడాది జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నానని పేర్కొన్నారు.