కర్నూలు బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పై ఏపీ సీఏం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆంధ్రుల అభిమానాన్ని దెబ్బతీసేలా ప్రధాని మాట్లాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజగా మోదీకి ఏడు పేజల బహిరంగ లేఖను రాశారు. మోదీ తనకు సంధించిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం ఇదేనని తెలిపారు. మోదీ అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రులు రగిలిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ గురించి కనీస చరిత్ర కూడా తెలియకుండా కర్నూలులో మోదీ అడుగుపెట్టారంటూ దుయ్యబట్టారు. కర్నూలు వచ్చిన తొలి ప్రధానిని తానేనని చెప్పుకోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నేతను దేశానికి ప్రధానిని చేసింది కర్నూలు జిల్లాయేనని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రధాని హోదాలో రాయలసీమకు వచ్చిన మీరు ఆ ప్రాంతానికి ఏం మేలు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. మీలాంటి నాయకులు కర్నూలుకు రావడం మా దురదృష్టమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.