సోషల్ మీడియాలో తమ వీడియోలకు ఎక్కువ లైక్ లు రావాలన్న పిచ్చి ప్రస్తుతం నేటి యువతలో పెరిగిపోయింది. తాజాగా యూట్యూబ్ లో తన వీడియోలకు ఎక్కువ లైకులు రావాలని భావించిన ఓ యువకుడు రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్లు, బైకులు, టపాసులు పెట్టి వీడియోలు షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఏదో అద్భుతం సృష్టిదమనుకున్న ఆ యువకుడు చివరకు కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా ఎర్నేడు మండలం చెల్లూరు కు చెందిన రామిరెడ్డి అనే యువకుడు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. తన వీడియోలకు ఎక్కువ లైకులు రావాలని భావించిన రామిరెడ్డి రైల్వే ట్రాక్ పై ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బైక్ లు, బాణాసంచా పెట్టేవాడు. రైలు దానిపై నుంచి వెళుతుండగా వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.
అయితే దీన్ని నరసింహా అనే వ్యక్తి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది నేరమని తనకు తెలియదనీ, యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ లైకులు రావాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని నిందితుడు పోలీసులకు వివరించారు.