మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు అందినట్టుగా గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చిరు ముందుగానే కమిట్ అయిన కొన్ని అపాయింట్మెంట్స్ కారణంగా మోదీ ఆహ్వానించినా ఆయన్న కలడవానికి వెళ్లలేకపోయారట. ప్రస్తుతం ఈ వార్తలు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ తరువాత సినిమాను భారీగా ప్రమోట్ చేసిన చిరు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి సినిమా చూడాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిసి సైరా సినిమాను చూడాలని కోరారు. తరువాత ఢిల్లీ వెళ్లిన చిరు పలు జాతీయ నేతలను సినిమా చూడాలని కోరారు. వెంటనే స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్తో కలిసి సైరా సినిమా చూసి ఆయన్ను అభినందించారు. అదే సమయంలో మోదీని కూడా ఈ షోకు చిరు ఆహ్వానించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచార హడావిడిలో ఉన్న మోదీ సైరా సినిమాను చూడలేకపోయారు. అందుకే చిరును ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా బాలీవుడ్ సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఈ సమావేశానికి దక్షిణాది సినీ ప్రముఖులను ఆహ్వానించకపోవటంపై చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఘాటుగా స్పందించారు. మేము కూడా ప్రధానిగా మీ పనితీరు చూసి గర్వపడుతున్నాం. కానీ సినీ ప్రముఖుల సమావేశంలో సౌత్ స్టార్స్కు చోటు కల్పించకపోవటం బాధాకరం అంటూ మోదీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్చరణ్లకు ప్రధాని ఆహ్వానం అంటూ వార్తలు రావటం ప్రధాన్యం సంతరించుకుంది. మరి నిజంగానే చిరు, చరణ్లకు మోదీ ఆహ్వానం అందిందా..? లేక ఇవన్నీ వట్టి రూమర్సేనా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.