బాలీవుడు ప్రముఖ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, మూడో స్టేజ్లో ఉందని వైద్యులు గుర్తించారు. త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ విషయం తెలియగానే సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. “డియరెస్ట్ సంజయ్ దత్ భాయ్, మీరు ఇలాంటి ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిసినప్పటి నుంచీ చాలా బాధగా ఉంది. కానీ, మీరొక యోధుడు. గడిచిన ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు కూడా మీరు దీన్ని జయిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా ప్రార్థిస్తున్నాం” అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు క్యాన్సర్ అనే విషయాన్ని సంజయ్ దత్ స్వయంగా వెల్లడించలేదు. ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. తాను కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరం కానున్నట్టు సంజయ్ దత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చికిత్స నిమిత్తం తాను షూటింగ్ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. తన ఆరోగ్యంపై ఎలాంటి వదంతులను నమ్మవద్దని, త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు.
Dearest @duttsanjay bhai , pained to know you are confronted with this health situation.But you are a fighter & have vanquished many crises over the years. Have no doubts you will come out of this with flying colors too.All our love and prayers for your speedy recovery. pic.twitter.com/uMTf3sN5R3
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 12, 2020