చైనాలోని వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరసు బారినపడి ముర్త్యువాతపడ్డ వారి సంఖ్య అనూహ్యంగా మరో 50 శాతం పెరిగింది. అక్కడి సిటీ గవర్నమెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మరణాలకు మరో 1,290 కేసులను అధికారులు జత చేశారు. దీంతో, వూహాన్ లో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,869కి చేరింది. ఇదే సమయంలో దేశంలోని మొత్తం మరణాల శాతం కూడా దాదాపు 39 శాతం పెరిగింది. దీంతో, చైనాలోని మొత్తం కరోనా మరణాలు 4,632కి చేరుకున్నాయి.
చైనాలోని కరోనా మరణాలపై ప్రపంచ దేశాలు అనుమానాలను వ్యక్తం చేసున్న నేపథ్యంలో ఆ దేశం వూహాన్ లో మరణాల సంఖ్యను పెంచడం గమనార్హం. కొన్ని కారణాల వల్ల ఈ మరణాలు రికార్డుల్లోకి ఎక్కలేకపోయాయిని అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. వూహాన్ లో కరోనా విజృంభిస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ తీవ్ర గందరగోళానికి గురయ్యారని వెల్లడించారు. దీని కారణంగా మరణాలకు సంబంధించి కొన్ని రిపోర్టులు మిస్ అయ్యాయని తెలిపారు.