రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ ఆశ్రమంలో తిరునక్షత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ప్రముఖులు, భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ ఉత్సవాల్లో ఆంద్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆశ్రమంలో జరిగిన వేడుకల్లో పాల్గొని స్వామీజీ ఆశీస్సులందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి చిన జీయర్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జీయర్ స్వామి తొలుత జ్ఞాన దీపాన్ని వెలిగించి, భక్తులకు ఆశీస్సులు, తీర్థప్రసాదాలు, ఆచార్యుల అనుగ్రహం అందజేశారు. అంతకు ముందు తిరునక్షత్ర ఉత్సవాలను లక్ష్మీ పూజతో ప్రారంభించారు. సుప్రభాత సేవ కార్యక్రమానంతరం జీయర్ పురస్కారాలను పండితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్ హాజరు అయ్యారు.