telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనాను దోషిగా నిలబెట్టేందుకు..దూకుడు పెంచిన ట్రంప్!

trump usa

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా పురుడుపోసుకొందని. ఈ ప్రపంచ విపత్తుకు డ్రాగన్ దేశమే కారణమని అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తున్నాయి.

చైనాను దోషిగా నిలబెట్టే చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వం వహిస్తున్నారు. చైనాపై సూటిగానే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో మరణాల సంఖ్య 30 వేలను దాటడంతో ట్రంప్ దూకుడు పెంచారు. మరోవైపు చైనాను ఒంటరి చేసేందుకు గ్రూప్-7 దేశాధినేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లు కూడా నిర్వహించారు.

ఆర్థికంగా బలమైన దేశాలన్నీ చైనాను దోషిగానే చూస్తున్నాయి. బ్రిటీష్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ చైనాతో ఇంతకు ముందు మాదిరి వ్యాపార లావాదేవీలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. కరోనా ఎలా పుట్టింది? దాన్ని వెంటనే ఎందుకు కట్టడి చేయలేకపోయారు? వంటి ప్రశ్నలు చైనా ముందు ఉంచుతామని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేసేందుకు చైనా చేస్తున్న యత్నాలు నమ్మశక్యంగా లేవని చెప్పారు. ప్రపంచానికి తెలియనివి చైనాలో జరిగాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ, వూహాన్ లోని ల్యాబ్ గురించి చైనా పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వైరస్ ప్రపంచంలోకి ఎలా వచ్చిందనే దానిపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ప్రపంచంలోని అగ్ర దేశాలు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంపై చైనా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా అధినేత పుతిన్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. చైనాపై విమర్శలు గుప్పిస్తున్న దేశాలను ఎదుర్కోవడంపై చర్చించారు. కరోనా మహమ్మారిని రాజకీయం కోసం వాడుకుంటున్నారని జిన్ పింగ్ అన్నారు.

Related posts