ఎవరూ కూడా చైనాను భయపెట్టలేరని, తమ దేశాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అధ్యక్షుడు సీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజధాని బీజింగ్లోని తియనాన్మెన్ స్వ్కేర్లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా 70 తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపి, జాతీయ ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 15 వేల మంది సైనికులు కవాతు నిర్వహించారు. యుద్ధ ట్యాంకులు, ఆధునిక అయుద సంపత్తి, వివిధ రకాల క్షిపణులను ప్రదర్శించారు. సైనిక బలగాలు నిర్వహించిన పరేడ్ కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేశాయి. ’70’ ఆకారంలో విమానాలు ఆకాశంలో సైనిక విన్యాసాలు ప్రదర్శించాయి . ఈ ఉత్సవాలకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. దేశంలోని పలు సినిమా థియేటర్లలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరేడ్గా ఆ దేశ మీడియా పేర్కొంది.
1949న మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనను ప్రకటించిన ‘గేట్ ఆఫ్ హేవెన్లీ పీస్’ ప్రాంతం నుంచి జిన్పింగ్ ప్రసంగించారు. శాంతియుతమైన అభివృద్ధినే తాము కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. చైనా సార్వభౌమత్వానికి కొన్ని దేశాలు ప్రమాదం సృష్టిస్తున్నాయని అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను దేశ బలగాలు సమర్ధవంతంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, ఇతర అంశాల్లో చైనా పురోగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతర దేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. పేదరికం నుంచి ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా ఎదిగాం. ఇంకా అభివృద్ధి సాధించగల సత్తా మనకుందని వ్యాఖ్యానించారు.