*ఏపీ సీఎం జగన్తో నాకు పరిచయం లేదు..
*ఫేక్ అకౌంట్స్పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశా..
*సోషల్ మీడియాలో నాపై తప్పడు ప్రచారం చేస్తున్నారు..
తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్ల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిపారు.
ఏపీ సీఎంతో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని.. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని చీకోటి ప్రవీణ్ చెప్పారు. దీని వెనుక ఏపీ ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లుగా అనుమానంగా ఉందని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులను పట్టుకోవాలని ఫిర్యాదులో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.
దీని వెనుక అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏపీ ప్రతిపక్షం అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసు… రాజకీయాలకు నాకు ముడిపెడుతున్నారు.
మరో వైపు క్యాసినో హవాల కేసులో మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన ప్రవీణ్, మాధవరెడ్డిలను విడివిడిగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడుగుతున్నారు. కొన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలను.. ప్రవీణ్ ఈడీ అధికారులకు చెప్పలేకపోతున్నట్లు తెలుస్తోంది.
నేపాల్లో జరిగిన క్యాసినోకు డబ్బులు ఎలా తీసుకెళ్లారని అడిగిన ప్రశ్నకు ప్రవీణ్, మాధవ రెడ్డిలు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.