టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుపై గ్రాఫిక్స్ చూపించుకున్నారే తప్ప ఏ ఒక్కపనీ చేయలేదని అన్నారు. నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన దేవినేని వేల కోట్ల రూపాయలను దోచుకుని తినేసి కొవ్వు పట్టిన మాటలు ఈరోజు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక నెలలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం ఆదా చేసిన మాటను దేవినేని ఉమ మర్చిపోయినట్టున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్ పై కేసులు బనాయించాలని కోరారు తప్పితే, రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపానపోలేదని దుమ్మెత్తిపోశారు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ప్రతీసారి, ప్రత్యేక హోదా అంశం, నిధుల గురించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.