భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో మాట్లాడారు..కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, దీని కారణంగా అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా తీర్పులివ్వడంలో సతమతపడుతున్నారని అన్నారు.
అనేక న్యాయపరమైన సమస్యలపై తప్పుడు సమాచారం, ఎజెండా అమలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ కంటే ప్రింట్ మీడియా జవాబుదారీగా ఉందని అభివర్ణించిన ఆయన.. మనం మన బాధ్యతల నుంచి పారిపోలేమని అన్నారు. ఇలాంటి ధోరణి మమ్మల్ని వెనుకకు నెట్టివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఏకీకృత ప్రచారాలు జరుగుతున్నాయనీ, న్యాయమూర్తులు వెంటనే స్పందించకపోవచ్చు. దయచేసి దీనిని బలహీనత లేదా నిస్సహాయత అని తప్పుపట్టవద్దని జస్టిస్ రమణ అన్నారు.
ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన యాంప్లిఫైయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనీ, అయితే .. వాస్త, ఆవాస్తవలు, మంచి- చెడుల మధ్య తేడాను గుర్తించటం లేదని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది.
మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు.
ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత వరకు జవాబుదారీతనంగా ఉందనీ, కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనంలో శూన్యమనీ, ఎందుకంటే.. అది చూపేది గాలిలో అదృశ్యమవుతుంది.ఇక సోషల్ మీడియా మరి అధ్వాన్నంగా ఉందని. సోషల్ మీడియాను స్వీయ నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలను విద్యావంతులను చేయడానికి, శక్తినివ్వడానికి వారి స్వరాన్ని ఉపయోగించాలని అన్నారు..
ఈ మధ్యకాలంలో జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదని ఆవేదన చెందారు.
న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదని అన్నారు
ప్రజాస్వామ్య జీవితంలో న్యాయమూర్తి స్థానం ప్రత్యేకమైందన్నారు. న్యాయమూర్తులు సమాజం యొక్క వాస్తవికత, చట్టం మధ్య అంతరాన్ని తొలగిస్తారనీ, రాజ్యాంగ విలువలను రక్షిస్తాడని తెలిపారు.