అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముత్యంరెడ్డి స్వస్థలం తొగుట మండలంలోని తిక్కాపూర్ గ్రామంలో జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముత్యంరెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మాజీమంత్రి సునీతా లక్ష్మా రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, ముత్యం రెడ్డి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ముత్యంరెడ్డి సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.