విశ్వనటుడు కమల్ హాసన్ కు చెన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కమల్హాసన్, కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకోగా దర్శకుడు శంకర్ కాలికి గాయమైంది. మృతుల్లో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (28), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60) ఉన్నారు. మృతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున) రూ.3 కోట్లు ఆర్థికసాయం అందచేస్తున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారాయన. అయితే ఈవీపీ ఫిలింసిటీలో జరిగిన ఈ ప్రమాదంపై తాజాగా చెన్నై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రేన్ ఆపరేటర్తో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే హీరో కమల్కు నోటీసులు జారీ చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్పై కేసు నమోదు చేశారు. దర్శకుడు శంకర్, కమల్ హాసన్కు సమన్లు జారీ చేశారు.