బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికైనందుకు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. అరుదైన గౌరవం దక్కిందంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. ‘‘50 ఏళ్లుగా భారతీయ సినిమాకు మీరందిస్తున్న అసమాన సేవలకు దక్కిన గుర్తింపు ఇది. మీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’’ అంటూ ట్వీట్ చేశారు.
అమితాబ్ను ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. 76 ఏళ్ల అమితాబ్ ఐదు దశాబ్దాల నట జీవితంలో 190కి పైగా సినిమాల్లో నటించారు. తన నటనతో దేశంలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించగానే ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.