ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో పెట్టుకొంటే తాట తీస్తానని చంద్రబాబు కేసీఆర్ ను హెచ్చరించారు. మన డబ్బులు కొట్టేసిన కేసీఆర్ 88 సీట్లలో గెలిస్తే… కేసీఆర్ కంటే తక్కువ సీట్లలో గెలిస్తే తాను కేసీఆర్ ముందు తలదించుకోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని బాబు చెప్పారు.
ఆంధ్రుల పౌరుషాన్ని చూపి 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కేసీఆర్కు వారం రోజులుగా పొగ పెడితే నిన్న బయటపడ్డాడని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు తాను మద్దతిస్తున్నానని కేసీఆర్ ప్రకటించాడని, అయితే కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో ఎందుకు మద్దతివ్వలేదో చెప్పాలన్నారు. 500 మంది కేసీఆర్లు, వెయ్యి మంది మోడీలు వచ్చినా కూడ తననేమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ జోలికి రావాలంటే వణికిపోవాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఆశీర్వదిస్తే ఏపీ ప్రజల హక్కుల కోసం సైనికుడిలా నిరంతరం పోరాటం చేస్తానని చంద్రబాబు అన్నారు.