గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. నిన్న సాయంత్రానికే ప్రచారం ముగిసింది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది ఇలా ఉండగా.. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ దూసుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్ ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. “హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా శ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్. సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచి. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పాల్సి ఉంటుంది. మాటలకన్నా చేతల్లోనే మేం చూపాం.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి ప్రముఖులను రప్పించి భావితరానికి బాటలు వేయగలిగాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం.. ఇవే లక్ష్యంగా ముందుకు సాగాం. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు మా తెలుగు దేశానివే అని సగర్వంగా చెప్పగలం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. GHMC ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి.” అంటూ చంద్రబాబు కోరారు.
previous post