టీడీపీపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే రీతిలో వైసీపీ బరితెగించిందని అన్నారు. ప్రజల సహనానికి కూడా హద్దులు దాటిపోయాయని చెప్పారు. వైసీపీ దుర్మార్గాలపై ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఎస్సీ ఆడబిడ్డల మానానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని అన్నారు. ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కులను కూడా కాలరాస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులూ చేసిందని ఆరోపించారు.