ఉదయం నుండి ఇసుక కార్మికుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రారంభించిన 12 గంటల దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశ్నించాడని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. పవన్ను తన దత్తపుత్రుడని అంటున్నారని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఈ పోరాటం చేయడం లేదని, భవిష్యత్ కోసం, పేదల కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, ఎన్నికల ముందే తాను చెప్పానని గుర్తుచేశారు.
మేం తలచుకుంటే వ్యక్తిగత విమర్శలు చేయగలం. గంగానదిలో మునిగి దొంగనాటకాలు ఆడింది ఎవరు? అన్యమత ప్రచారం చేస్తుంది ఎవరు? అన్నవరంలాంటి చోట్ల కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. నా జీవితాన్ని కాపాడిన వెంకటేశ్వరస్వామి అంటే నాకు అపారమైన భక్తి. మనందరం ప్రాణంగా కొలిచే తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. నాకు కులం అనేది ఎప్పుడూ లేదు. సామాజిక న్యాయమే నా కులం. కులం పేరుతో సమాజాన్ని విభజించాలనుకోవడం దుర్మార్గం. ఇలాంటి జఠిలమైన సమస్యపై మేం దీక్ష చేస్తుంటే.. మా పార్టీ వాళ్లని చేర్చుకుని నన్ను తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.