ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పర్యటన కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు
ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి బలవంతంగా కారును తీసుకు వెళ్ళడం దారుణమని అన్నారు..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇలాగే వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసెయ్యడం చేస్తున్నారని… ఇప్పుడు మరింత దిగజారి సిఎం కాన్వాయ్ కోసం సామాన్యుల కార్లను బలవంతంగా లాక్కెళ్ళే స్థాయికి చేరారని… ఇది సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు.
ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు.. మహిళల శీలాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందన్నారు.
వైసీపీ రాజకీయాల్లో ఉండదగ్గ పార్టీ కాదన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. చాలా కోపం వస్తోందని.. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని ఇదే అని చంద్రబాబు అన్నారు.